
సాక్షి డిజిటల్ న్యూస్ ఆలూరు నియోజకవర్గం రిపోర్టర్ 03/09/2026 తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన అనంతరం రాష్ట్రవ్యాప్తంగా పార్టీ కార్యకర్తలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకునే ఉద్దేశంతో టీడీపీ కేంద్ర కార్యాలయంలో గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి , రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన్ చైర్మన్ కప్పట్రాళ్ల బొజ్జమ్మ పాల్గొని పార్టీ కార్యకర్తల నుంచి సమస్యలు, వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా కప్పట్రాళ్ల బొజ్జమ్మ మాట్లాడుతూ, టీడీపీ కార్యకర్తల సమస్యలు, కష్టాలు, ఇబ్బందులను నేరుగా తెలుసుకుని, వాటి పరిష్కారానికి కృషి చేసేందుకు గ్రీవెన్స్ కార్యక్రమం ఎంతో మంచి వేదికగా నిలుస్తోందని అన్నారు. తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్న ప్రతి కార్యకర్తకు పార్టీ, ప్రభుత్వం అండగా ఉంటాయని తెలిపారు. కార్యకర్తలు గ్రీవెన్స్ కార్యక్రమంలో తెలియజేసిన సమస్యలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, యువనేత నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్లి, సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యకర్తల సంక్షేమం, వారి సమస్యల పరిష్కారం కోసం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుందని కప్పట్రాళ్ల బొజ్జమ్మ స్పష్టం చేశారు.